
గేమింగ్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న వాల్వ్ సంస్థ, ఇప్పుడు మరో పెద్ద అడుగు వేసింది. తాజాగా “స్టీమ్ మిషిన్” అనే కొత్త గేమింగ్ కన్సోల్ను ప్రకటించింది. ఈ డివైస్ 2026 ప్రారంభంలో అధికారికంగా మార్కెట్లోకి రానుంది. స్టీమ్ డెక్ విజయానికి కొనసాగింపుగా రూపొందించిన ఈ గాడ్జెట్, గేమింగ్ ప్రేమికులకు కొత్త అనుభవాన్ని అందించనుంది.
వాల్వ్ సంస్థ ప్రకారం, స్టీమ్ మిషిన్ పనితీరు స్టీమ్ డెక్ కంటే ఆరు రెట్లు అధికంగా ఉండబోతోంది. శక్తివంతమైన ప్రాసెసర్, కొత్త గ్రాఫిక్ ఇంజిన్తో ఈ డివైస్ భారీ స్థాయి AAA గేమ్స్ను సులభంగా నడపగలదు. కన్సోల్ సైజ్ కేవలం ఆరు అంగుళాల క్యూబ్ ఆకారంలో ఉండి, టీవీ లేదా మానిటర్కి సులభంగా కనెక్ట్ చేయవచ్చు.
కనెక్టివిటీ పరంగా ఈ డివైస్లో HDMI 2.0, డిస్ప్లేపోర్ట్ 1.4 వంటి ఆధునిక పోర్టులు ఉన్నాయి. అలాగే Wi-Fi 6E, Bluetooth 5.3 సపోర్ట్ ఇవ్వడం వలన వైర్లెస్ గేమింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది. స్టోరేజ్ వేరియంట్లు 512GB నుండి 2TB వరకు అందుబాటులోకి రానున్నాయి. ఉస్ చేసేవాళ్ళు స్టీమ్ఓఎస్తో పాటు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్లను కూడా ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
వీడియో గేమ్ ప్లేయర్ల కోసం ఈ డివైస్ ఒక “ప్లగ్ అండ్ ప్లే” అనుభవాన్ని అందిస్తుంది. LED లైట్ సూచికల ద్వారా సిస్టమ్ స్థితి, గేమ్ డౌన్లోడ్ ప్రగతి వంటి వివరాలు సులభంగా చూడవచ్చు. వినియోగదారులకు వీజువల్ ఫీడ్బ్యాక్ ఇచ్చే ఈ ఫీచర్ కన్సోల్ డిజైన్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ధర వివరాలు వాల్వ్ ఇంకా వెల్లడించలేదు కానీ, అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 700 నుండి 1000 డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. భారత మార్కెట్లో విడుదలపై ఇప్పటికీ స్పష్టత లేకపోయినా, కంపెనీ భారత్ను ముఖ్యమైన మార్కెట్గా పరిగణిస్తున్నట్లు సమాచారం.
స్టీమ్ మిషిన్ గేమింగ్ కన్సోల్ విడుదలతో వాల్వ్ సంస్థ సోనీ ప్లేస్టేషన్, మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. పీసీ గేమింగ్ మరియు కన్సోల్ గేమింగ్ మధ్య తేడాను తగ్గిస్తూ, ఒక కొత్త యుగానికి నాంది పలికినట్లు భావిస్తున్నారు.
గేమింగ్ అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఈ డివైస్, వాల్వ్ కంపెనీకి మరో మైలురాయిగా నిలవడం ఖాయం. 2026లో స్టీమ్ మిషిన్ లాంచ్ అయిన తర్వాత, గేమింగ్ ప్రపంచం ఎలా మారబోతుందో ఆసక్తిగా చూడాల్సి ఉంది.
